ఆ ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష

11 Dec, 2015 17:07 IST|Sakshi
ఆ ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష

కోల్ కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన (పార్క్ స్ట్రీట్ రేప్) సామూహిక అత్యాచారం  దోషులకు  కోర్టు  శిక్షను ఖరారు చేసింది.  ఆంగ్లో ఇండియన్ మహిళపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన ముగ్గురి నేరస్థులకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు, లక్షరూపాయల జరిమానా విధించింది. జరిమానా  చెల్లించకపోతే  మరో  ఆరోనెలల కఠిన కారాగార శిక్షను అమలు చేయాలని ఆదేశించింది.

రుమాన్ ఖాన్, నాజిర్  ఖాన్, సుమిత్ బజాజ్  లను దోషులుగా తేల్చిన  న్యాయస్థానం శుక్రవారం తన తీర్పును వెలువరించింది.  మొత్తం అయిదుగురిపై కేసు నమోదుకాగా, ప్రధాన నిందితుడు సహా ఇద్దరు ఇంకా  పరారీలో ఉన్నారు.  కోల్ కతా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి  తుది తీర్పును వెలువరించారు.

2012 ఫిబ్రవరిలో అయిదుగురు యువకులు కోలకత్తాలోని పార్క్ స్ట్రీట్  ఏరియాలో జోర్డాన్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో అత్యాచారం చేసి బయటికి విసిరేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనను కట్టుకథగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు.  

కాగా బాధితురాలు జోర్డాన్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా కోలకత్తా వీధుల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.  లైంగికదాడికి గురైన వారి బాధ ఎలా ఉంటుందో  తనకు తెలుసని, మౌనాన్ని వీడి మన బాధను పంచుకోవడం ద్వారా ఆ భయంకర గాయాల నుంచి బయట పడాలంటూ బాధితులకు  ధైర్యం  చెప్పేవారు. అంతేకాదు అత్యాచార బాధితుల  పునరావాసం కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. జోర్డాన్ అనారోగ్య కారణాలతో గత మార్చిలో కన్నుమూశారు.

మరిన్ని వార్తలు