లెదర్ కాంప్లెక్స్లో విషాదం.. ముగ్గురి మృతి

7 Dec, 2015 12:42 IST|Sakshi

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ఓ లెదర్ కాంప్లెక్స్ లో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ పైప్ లైన్ నుంచి వెలువడిన విష వాయువులను పీల్చిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. కోల్ కతా లెదర్ కంపెనీలో సోమవారం ఐదుగురు కార్మికులు డ్రైనేజీ పైప్ లైన్ శుభ్రం చేస్తున్నారు. ఆ పైప్ లైన్ నుంచి విష వాయువులు వెలువడ్డాయి.

అందులో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తూ ఆ వాయువులను పీల్చడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు కోల్ కతా ఈస్ట్ జోన్ ఏఎస్పీ అరిజిత్ సిన్హా తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మిగతా కార్మికులు.. మృతిచెందిన తోటి కార్మికుల కుటుంబాలకు తగిన నష్ట పరిహారం అందించాలని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్పీ వివరించారు.

>
మరిన్ని వార్తలు