ఖననం.. మానవత్వం హననం 

1 Jul, 2020 04:50 IST|Sakshi

పెద్దగొయ్యిలో 9 కరోనా మృతదేహాల విసిరివేత

బళ్లారిలో అమానుషం  

సాక్షి, బళ్లారి: కరోనా వైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలు అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉండగా మరింత క్షోభించేలా అధికార సిబ్బంది వ్యవహరించారు. కరోనా బాధితుల మృతదేహాలను పెద్ద గొయ్యి తీసి అందులో విసిరివేయడం అందరినీ నివ్వెరపరచింది. బళ్లారిలో సోమవారం జరిగిన ఘటన వీడియోలు మంగళవారం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బళ్లారిలోని విమ్స్‌ కోవిడ్‌ విభాగంలో కోవిడ్‌కు చికిత్స పొందుతూ బళ్లారికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, సిరుగుప్పకు చెందిన 31 ఏళ్ల యువకుడు, కొప్పళ జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన ఇద్దరు (41, 52ఏళ్లు) వ్యక్తులు, చిత్రదుర్గంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు, శ్రీరంగాపురం క్యాంప్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తి, హŸసపేటకు చెందిన ఇద్దరు కన్నుమూశారు. తొమ్మిది మంది మరణాలతో ఆస్పత్రి ప్రాంగణంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కరోనా మృతుల అంత్యక్రియలను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి ఉన్నందున అంబులెన్సుల్లో నల్లరంగు బ్యాగ్‌లలో చుట్టి శ్మశానానికి తీసుకెళ్లారు. విడిగా సమాధి చేయకుండా పొక్లెయినర్‌తో పెద్ద గొయ్యిని తీసి అన్నిటినీ గొయ్యిలో విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను సస్పెండ్‌ చేసినట్లు మంత్రి శ్రీరాములు చెప్పారు.

మరిన్ని వార్తలు