రైల్వే కౌంటర్లలో టికెట్ల బుకింగ్‌పై స్పష్టత

21 May, 2020 15:00 IST|Sakshi

న్యూఢిల్లీ : త్వరలోనే మరిన్ని రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. నేడు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన పీయూష్‌ గోయల్‌ పలు అంశాలు వెల్లడించారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఎంపిక చేసిన రైల్వే కౌంటర్లలో టికెట్‌ బుకింగ్‌ ప్రారంభిస్తామని తెలిపారు. ఆఫ్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి నిబంధనలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. 

వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కొన్ని రాష్ట్రాలు తమకు సహకరించడం లేదని తెలిపారు. దాదాపు 40 లక్షల మంది వలసకూలీలు పశ్చిమ బెంగాల్‌కు చేరుకోవాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 27 ప్రత్యేక రైళ్లు మాత్రమే ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టాయని చెప్పారు. కాగా, జూన్‌ 1 నుంచి 200 రైళ్లు అందుబాటులోకి రానున్నట్టు బుధవారం ప్రకటన చేసిన రైల్వే శాఖ.. నేటి నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభించింది. అయితే ఈ బుకింగ్‌కు విశేషమైన స్పందన వచ్చింది. కేవలం గంటల వ్యవధిలోనే లక్షల టికెట్లు అమ్ముడయిపోయాయి.(చదవండి : నేటి నుంచే రైల్వే బుకింగ్స్‌)

మరిన్ని వార్తలు