నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి

19 Mar, 2020 04:44 IST|Sakshi

న్యూఢిల్లీ/ఔరంగాబాద్‌: నిర్భయ దోషుల ఉరికి సర్వం సిద్ధమవుతోంది. మీరట్‌ నుంచి తలారి పవన్‌ తీహార్‌ జైలుకు చేరుకొని బుధవారం డమ్మీ ఉరి వేసి తాళ్లను పరీక్షించారని జైలు అధికారులు తెలిపారు. దోషులకు ఉరి వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన మనీలా తాళ్లను ఉపయోగిస్తారు. తలారి పవన్‌ వీటినే పరీక్షించారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి, ఈ నెల 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఖరారైన సంగతి తెలిసిందే. నలుగురు దోషుల్లో ఒకరు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌లో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి.  నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్‌ ఠాకూర్‌ భార్య తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఔరంగాబాద్‌ కోర్టులో కేసువేశారు. రేప్‌ చేసిన వ్యక్తికి భార్యగా కొనసాగడం తనకు ఇష్టంలేదని పునీతా మంగళవారం పిటిషన్‌ దాఖలు చేయగా గురువారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు