కోవిడ్‌ కల్లోలం; స్వైన్‌ ఫ్లూ ‘సైలెంట్‌’

19 Mar, 2020 16:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో కాలానుగుణంగా సంక్రమించే వైరస్‌ అంటు వ్యాధులను మొదటి సారిగా 2009లో గుర్తించారు. జనవరి నుంచి మార్చి, జూలై నుంచి సెప్టెంబర్‌ నెలల మధ్య ఈ వైరస్‌ల వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారు. 2019లోనే భారత దేశాన్ని స్వైన్‌ ఫ్లూ కుదిపేసింది. శాస్త్ర విజ్ఞాన పరిభాషలో ‘హెచ్‌1ఎన్‌1’గా వ్యవహరించే ఈ వైరస్‌ కేసులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో భారత్‌లో రెట్టింపు అయ్యాయి. (చదవండి: ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం)

ఈ ఏడాది కూడా మార్చి వరకు దేశంలో స్వైన్‌ ఫ్లూ కేసులు 1100 దాఖలుకాగా, 28 మంది మరణించారు. ఈ స్వైన్‌ ఫ్లూ కారణంగా ఫిబ్రవరి నెలలో జర్మనీకి చెందిన కంపెనీ స్వాప్‌ భారత్‌లోని తన యూనిట్‌ను మూసివేసింది. బెంగళూరులోని తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్‌ సోకడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి మొదటి వారానికి ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 78 కేసులు నమోదయ్యాయి. వారిలో 19 మంది పోలీసులు అస్వస్థులుకాగా వారిలో 9 మంది మరణించారు. అదే నెలలో ఈ వైరస్‌ కారణంగా ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జీలు అస్వస్థులయ్యారు.

2018 సంవత్సరంలో పోల్చినట్లయితే 2019లో స్వైన్‌ ప్లూ కేసులు రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి అశ్వణి కుమార్‌ చౌబే స్వయంగా లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. మరణాలు కూడా అదే నిష్పత్తిలో పెరిగాయి. కోవిడ్‌ మహమ్మారి గురించి వార్తలు వెలువడడంతో ఈ స్వైన్‌ ఫ్లూ కేసులు మరుగున పడిపోయాయి. వాస్తవానికి రెండు వైరస్‌ల లక్షణాలు ఒకే రీతిగా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు మంట, శ్వాస ఇబ్బంది, జ్వరం బాధిస్తాయి. వైరస్‌ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకటే! (కరోనా ఎఫెక్ట్‌ : అలిపిరి టోల్‌గేట్‌ మూసివేత)

మరిన్ని వార్తలు