ఘోరం : గుక్కపట్టి ఏడుస్తుంటే విసిగిపోయి...

25 Feb, 2018 13:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుతో కన్న ప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించిందో తల్లి. విసుగుపుట్టి తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయగా.. ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని వినోద్‌ నగర్‌కు చెందిన నేహా 25 రోజుల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి పాలు పట్టిస్తున్నప్పటికీ గుక్కపట్టి ఏడుస్తోంది(అనారోగ్య సమస్య ఉందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు). దీంతో అసహనానికి లోనైన నేహ దారుణానికి పాల్పడింది. శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసింది. పాప కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులంతా కంగారుపడగా.. తాను కూడా వారితోపాటు వెతికినట్లు నటించింది. 

చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సాక్ష్యులను విచారణ చేపట్టగా స్థానికుడొకరు నేహ చెత్తకుండీలో ఏదో మూట పడేయటం చూశానని చెప్పాడు. దీంతో పోలీసులకు ఆ తల్లిపై అనుమానం మొదలైంది. ఈ క్రమంలో వారు ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె నేరం ఒప్పుకుంది. 

చిన్నారి ఏడుస్తుంటే తట్టుకోలేకనే తాను ఆ పని చేసినట్లు వివరించింది. దీంతో పోలీసులు హుటాహుటినా చెత్త కుప్ప వద్దకు వెళ్లారు. కొన ఊపిరితో ఉన్న పసికందును ఆస్పత్రికి తరలించి బతికించే ప్రయత్నం చేశారు. అయితే తలకు బలమైన దెబ్బ తలగటంతో ఆ  పసికందు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో పోలీసులు నేహను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు