పాపం : కొండచిలువకు బొక్కలిరిగాయి!

16 Mar, 2020 10:00 IST|Sakshi
కొండచిలువకు చికిత్స చేస్తున్న డాక్టర్‌

మధురై : ఎముకలు విరగొట్టుకుని ఓ కొండచిలువ ఆసుపత్రి పాలైంది. దాని అదృష్టం బాగుండి సరైన సమయంలో వైద్యం అందటంతో ప్రాణాలు నిలుపుకోగలిగింది. ఈ సంఘటన తిరునల్వేలిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధురై వీరమన్నలూర్‌కు చెందిన ఓ రైతు తన పోలంలో ఐదు అడుగులు ఉన్న ఓ కొండచిలువను చూశాడు. ఆ వెంటనే పాములను రక్షించే సిబ్బందికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న వారు అది కదలటానికి ఇబ్బంది పడుతుండటం గమనించారు. ఆ వెంటనే దాన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కొండచిలువను పరీక్షించిన ఆర్థోపెడిస్ట్‌ దాని వీపు దగ్గర రెండు చోట్ల ఎముకలు విరిగినట్లు గుర్తించాడు. మనుషులకు కట్టుకట్టే విధంగా  దానికి కూడా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో కట్టుకట్టి చికిత్స చేశాడు.

కొండచిలువకు చికిత్స చేస్తున్న డాక్టర్‌
ఈ సంఘటనపై వణ్యప్రాణి సంరక్షణా సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. సకాలంలో దానికి చిక్సిత చేసి ఉండకపోయినట్లయితే చచ్చిపోయేదని అన్నారు. పాము కోలుకునేంతవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు. దానికి నయం అయిన తర్వాతే అడవిలో వదిలిపెడతామని చెప్పారు. కాగా, కొండచిలువకు కట్టుకడుతున్న ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు