టీఎంసీ లోగో నుంచి కాంగ్రెస్‌ పేరు తొలగింపు

23 Mar, 2019 19:30 IST|Sakshi

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ పార్టీకి చెందిన లోగోల్లో ‘కాంగ్రెస్’  పదాన్ని తొలగించాలని నిర్ణయించింది. టీఎంసీని స్థాపించిన 21 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విషయం గురించి సీనియర్‌ టీఎంసీ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘21 ఏళ్ల తర్వాత టీఎంసీ తృణమూల్‌గా పిలవబడుతుంది. మార్పుకు సమయం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక తమ పార్టీకి చెందిన బ్యానర్లు, పోస్టర్లతో పాటు ఇతర అన్ని వ్యవహారాల్లోనూ కాంగ్రెస్‌ అనే పదాన్ని తొలగించనున్నట్లు తెలిపారు. అయితే, ఎన్నికల సంఘం వద్ద నమోదైన పేరులో మాత్రం ‘తృణమూల్‌ కాంగ్రెస్‌’గానే ఉంటుందని స్పష్టం చేశారు.

కొత్త లోగోలో తృణమూల్‌ అనే పదం ఆకుపచ్చ రంగులో కనపడుతుంది. దానిపై రెండు పుష్పాలు ఉన్నాయి. వెనకవైపున నీలిరంగు ఉంటుంది. ఇప్పటికే ఈ కొత్త లోగో ఫోటోలు మమతా బెనర్జీ అధికారిక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఎకౌంట్లతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఒబ్రెయిన్‌కు చెందిన సోషల్‌మీడియా ఎకౌంట్లలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు