పార్లమెంటు వద్ద ఫొటోలు.. బుక్కైన ఎంపీలు..!

28 May, 2019 18:06 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ తాజా ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున పోటీచేసి గెలిచిన బెంగాల్‌ నటీమణులు మిమి చక్రవర్తి, నుస్రత్‌ జహాన్‌ అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలయ్యారు. ఎంపీలుగా ఎన్నికైన ఈ ఇద్దరు సోమవారం పార్లమెంట్‌ను సందర్శించారు. అనంతరం మోడ్రన్‌ డ్రెస్సుల్లో అక్కడ ఫొటోలకు పోజిచ్చారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఫొటోలు దిగేందుకే పార్లమెంటుకు వెళ్లారా..? అని నెటిజన్లు వారిని ప్రశ్నిస్తున్నారు.

టీఎంసీ మీకు ఏ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చిందని, కుర్ర చేష్టలతో బెంగాల్ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారి హక్కుల్ని కాపాడేందుకు ఎన్నుకుంటే.. అక్కడ ఫొటోల పేరుతో డ్రామాలాడుతున్నారని ఓ నెటిజన్‌ చురకలంటించారు. ఓ ప్రజాప్రతినిధిగా హుందాగా ఉండాల్సింది పోయి.. సినిమా షూటింగ్‌లో మాదిరిగా ఈ ట్రెండీ లుక్‌ అవసరమా అని మరో నెటిజన్‌ విమర్శించారు. ఇక మిమి.. జాదవ్‌పూర్‌ నుంచి నుస్రత్‌.. బసిర్హాత్‌ నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు