నేటి వార్తా విశేషాలు

4 May, 2017 08:34 IST|Sakshi

నేడు కొత్త బస్సులకు మోక్షం
హైదరాబాద్‌: బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి మరీ కొనుగోలు చేసిన దాదాపు 300 బస్సులకు 4 నెలల తర్వాత మోక్షం కలుగుతోంది. ఎట్టకేలకు వాటిని సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రారంభించబోతున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఏసీ మినీ వజ్ర బస్సులు 60, నాన్‌ ఏసీ మినీ పల్లెవెలుగు బస్సులు 50 ఉన్నాయి. సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు 190 ఉన్నాయి.

నేటి నుంచి చంద్రబాబు బృందం అమెరికా పర్యటన
ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఇతర అధికారులు మొత్తం 15 మంది అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలతో లోకేశ్‌ ఒప్పందాలు చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు ముందుగా ప్రచారం చేశాయి. అక్కడ ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగకపోతే పరువు పోతుందనే భావనతో పాటు రాజకీయంగా కూడా సరికాదనే భావనతో లోకేశ్‌ అమెరికా పర్యటన రద్దుచేసుకున్నారు.

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ సమావేశం
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంపై ఇవాళ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ సమావేశం కానుంది. ప్రాజెక్టుల ద్వారా నీటి కేటాయింపులపై చర్చించనున్న ట్రిబ్యునల్‌. నదీ జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ ఇచ్చే స్టేట్‌మెంట్లను తమకు ఇవ్వాలన్న కర్ణాటక ప్రభుత్వ తరఫు న్యాయవాది వినతిని ఇటీవల ట్రిబ్యునల్‌ తిరస్కరించింది.

5న ఏపీ ఎంసెట్‌–17 ఫలితాలు
కాకినాడ: ఏపీ ఎంసెట్‌–17 ఫలితాలు మే 5న విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు విజయవాడ స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–09 కౌంట్‌ డౌన్‌
సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో రెండో ప్రయోగ వేదిక నుంచి మే 5వ తేదీ సాయంత్రం 4.57 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–09 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి 22 గంటల ముందు మే 4న సాయంత్రం 6.57 కు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం సుమారు12 ఏళ్ల పాటు సేవలను అందిస్తుంది.

చిత్తూరులో కేంద్ర మంత్రి పర్యటన
తిరుపతి: కేంద్ర మంత్రి కల్‌ రాజ్‌ మిశ్రా నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేణిగుంట సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్‌ హబ్‌ ను పరిశీలించనున్న కేంద్ర మంత్రి.

నేటి నుంచి 6వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల: నేటి నుంచి మూడ రోజులపాటు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నిర్వహిస్తారు. నారాయణగిరివనంలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ మలయప్పస్వామి, రేపు అశ్వవాహనం, ఎల్లుండి గురడ వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. నేటి నుంచి 6వ తేదీ వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.

ఐపీఎల్‌-10 షెడ్యూల్‌
ఢిల్లీ: నేటి మ్యాచ్ లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తో తలపడనున్న గుజరాత్‌. ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం
 

మరిన్ని వార్తలు