జబల్పూర్: రెండున్నరేళ్లకు పైగా సాగిన ఫేస్బుక్ ప్రేమ చివరికి విషాదాంతమైంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన వినీత్ సింగ్(22)కు మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన జ్యోతి కొరి(44) ఫేస్బుక్లో పరిచయమైంది. అయితే తన వయసును, పెళ్లైందని, ముగ్గురు పిల్లలున్న విషయాలన్నీ ఆమె దాచిపెట్టింది. ఫేస్బుక్ పేజీలో తన ఫొటో కాక వేరే వారి ఫొటోలు పెట్టింది. అదే నిజమని నమ్మిన వినీత్ ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు.
అందుకు ఆమె కూడా అంగీకరించింది. రెండున్నరేళ్ల తర్వాత ప్రేయసిని చూడాలని ఏప్రిల్ 18న జబల్పూర్ వచ్చాడు వినీత్. కానీ, రెట్టింపు వయసున్న జ్యోతిని చూసి వినీత్ నిర్ఘాంతపోయాడు. తాను ఫేస్బుక్లో చూసిన అమ్మాయి నిజం కాదని, తాను మోసపోయానని తెలుసుకుని ఉద్రేకానికి లోనయ్యాడు. తుపాకీతో జ్యోతిని కాల్చిచంపి, తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వినీత్ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పోలీసులతో జరిగినదంతా చెప్పి వినీత్ తుది శ్వాస విడిచాడు.