సాధారణ పౌరుడిగానే సవాలు విసిరా

30 Jul, 2018 04:19 IST|Sakshi

న్యూఢిల్లీ: తన ఆధార్‌ వివరాలు దుర్వినియోగం చేసి చూపాలని నెటిజన్లకు సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ ఆదివారం వెనక్కు తగ్గారు. తాను ఓ సాధారణ భారతీయుడిగానే ఈ సవాలు విసిరాననీ, ట్రాయ్‌ చైర్మన్‌గా కాదని వివరణ ఇచ్చారు. సమాచార గోప్యతపై జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో.. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం ఆధార్‌ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది.

దీంతో తన ఆధార్‌ నెంబర్‌ను బయటకు వెల్లడించిన శర్మ.. దమ్ముంటే దాన్ని దుర్వినియోగం చేయాలని సవాలు విసిరారు. శర్మ సవాలుకు స్పందించిన పలువురు హ్యాకర్లు.. ఆధార్‌తో లింక్‌ అయిన 2 ఈ–మెయిల్స్, ఫోన్‌ నంబర్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఎయిర్‌ఇండియా ఆయనకు కేటాయించిన ఫ్రీక్వెంట్‌ ఫ్లయర్‌ నంబర్‌(103546250)ను బయటపెట్టారు. కొందరైతే ఆయన నంబర్‌తో నకిలీ ఆధార్‌ను తయారుచేసి ఫేస్‌బుక్, అమెజాన్‌ క్లౌడ్‌ సర్వీసెస్‌లో రిజిస్టర్‌ కాగా, మరికొందరు ఆయనకు ఖరీదైన మొబైల్‌ ఫోన్లను క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్‌ పెట్టి కసి తీర్చుకున్నారు.

మరిన్ని వార్తలు