దుస్తులు చింపేసి.. అవమానం
ముంబై : రైలు దిగే సమయంలో మొదలైన గొడవ ఓ మహిళను కటకటాలపాలు చేయగా.. మరో యువతిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటన ముంబైలోని కాందివళి రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మలద్ ప్రాంతానికి చెందిన యువతి (20) సోమవారం కాలేజీకి బయల్దేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో కాందివళి స్టేషన్లో రైలు దిగింది. అయితే, అదే సమయంలో రైలు దిగుతున్న ఓ మహిళా చేపల వ్యాపారి (38) సదరు యువతిని తోసుకుంటూ రైలు దిగేసింది.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈక్రమంలో యువతిపట్ల అనుచితంగా ప్రవర్తించిన మహిళ.. అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగింది. అంతటితో ఆగకుండా యువతి దుస్తులు చింపి.. దుర్భషలాడింది. సహాయం కోసం యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అసభ్యంగా మట్లాడటమే కాకుండా.. దుస్తులు చింపి తనను వేధింపులకు గురిచేసిందని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను స్టేషన్కు తరలించారు.