రైల్వే ప్రయాణానికి విమాన చార్జీలు!

12 Mar, 2014 08:42 IST|Sakshi
రైల్వే ప్రయాణానికి విమాన చార్జీలు!

సంక్రాంతి.. దసరా లాంటి ముఖ్యమైన పండుగలు వస్తే ప్రజల కంటే ఆర్టీసీ,  ప్రైవేట్ వాహనాల యజమానులే ఎక్కువగా సంబరపడిపోతుంటారు. కారణమేంటంటే ప్రయాణికుల రద్దీ వల్ల వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ సహా ఆర్టీసీ యాజమన్యాలు టిక్కెట్ చార్జీలు భారీగా పెంచి సొమ్ము చేసుకుంటుంటాయి. స్పెషల్ బస్సుల్లో అయితే మామూలు కంటే 50 శాతం ఎక్కువ చార్జీ ఉంటుంది. ఇప్పుడు రైల్వే శాఖ వీళ్లందరి కంటే నాలుగాకులు ఎక్కువ చదివేసింది.

హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-జమ్మూ సెక్టార్ల మధ్య రెండు సూపర్ ఫాస్ట్ ప్రీమియమ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. టిక్కెట్ చార్జీలను మాత్రం కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెంచేసింది. ఏకంగా 250 నుంచి 300 శాతం వరకు ఉండే అవకాశముంది. చివరి నిమిషంలో వీటిలో బుక్ చేసుకుంటే మాత్రం 2500 రూపాయల 2 టైర్ ఏసీ టిక్కెట్ ధర 7000 లేదా మరింత ఎక్కువ కూడా పెరగొచ్చు. వీటితో పోలిస్తే విమాన చార్జీలే తక్కువ. ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా రైల్వే శాఖకు భారీ ఆదాయం సమకూరనుంది. డిమాండ్ను బట్టి టిక్కెట్ల ధరను పెంచుతుంటామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

సాధారణంగా ఢిల్లీ నుంచి ముంబై, జమ్మూలకు తగిన సంఖ్యలో రైళ్ల ఉన్నాయి. హోలీకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో ఇవి చాలడం లేదు. విమానాలకు కూడా రద్దీ ఎక్కవుగా ఉంటోంది. రైల్వే శాఖకు ఇదే కలిసొచ్చింది. ఢిల్లీ నుంచి ఈ నెల 14, 16న ముంబైకి, 14, 16, 21న జమ్మూకు ప్రత్యేక రైళ్లు బయల్దేరుతాయి.

మరిన్ని వార్తలు