మొక్కల ‘అంబులెన్స్‌’ 

26 Aug, 2018 02:13 IST|Sakshi

రోడ్డు ప్రమాదం జరిగినా లేదా అత్యవసర వైద్య సాయం అవసరమైనా వెంటనే అంబులెన్స్‌ గుర్తుకొస్తుంది. రోగిని ఆస్పత్రికి తరలించే లోపు అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఫలితంగా చాలామంది రోగులు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డ సందర్భాలు అనేకం. అదే మొక్కలకు రోగం వస్తే? అత్యవసర చికిత్స అవసరమైతే? అందుకోసమే ఇప్పుడు కొత్తరకం అంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. అదే ట్రీ అంబులెన్స్‌. మొక్కలకు అవసరమైన చికిత్స అందించడం, వాటిని సంరక్షించడం వీటి బాధ్యత.

మధ్యప్రదేశ్‌ ఛత్తర్‌పూర్‌ జిల్లాలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఈ అంబులెన్స్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లో మొక్కల నిపుణుడు, సహాయ సిబ్బంది, మొక్కలు నాటేందుకు అవసరమైన పరికరాలు, నీరు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంటాయి. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణకు కృషి చేస్తున్న కొందరు కలసి సేవాలయ బృందంగా ఏర్పడ్డారు. ఎవరికైనా మొక్కల పెంపకంలో ఇబ్బందులు ఉంటే ఈ ట్రీ అంబులెన్స్‌ ద్వారా వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు.

పర్యావరణం పరిరక్షణ, పచ్చదనం కోసం చాలామంది మొక్కలు నాటుతారు. అయితే 60 నుంచి 70 శాతం మొక్కలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాయి. వీటిని ఎలా సంరక్షించాలో తెలియకపోవడం వల్ల చనిపోతున్నట్లుగా తాము గుర్తించామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ట్రీ అంబులెన్స్‌ ద్వారా ఉచితంగానే సేవలందించడం మరో విశేషం. ఐడియా బాగుంది కదూ..!

మరిన్ని వార్తలు