దేశ రాజధానిలో భూకంపం

3 Jul, 2020 19:53 IST|Sakshi

వరుస ప్రకంపనలతో ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో శుక్రవారం సాయంత్రం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం హరియాణాలోని గుర్‌గావ్‌కు నైరుతి దిశగా 63 కిలోమీటర్ల దూరంలో ఉందని జాతీయ భూప్రకంపనల కేంద్రం తెలిపింది. భూకంప ప్రభావంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.7గా నమోదైంది. కాగా భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన వివరాలూ ఇంతవరకూ వెల్లడికాలేదు.

గత రెండు నెలల్లో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో భూమి కంపించడం ఇది 17వసారి కావడం గమనార్హం. ఢిల్లీలో జూన్‌ 8న చివరిసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 2.1గా నమోదైంది. వరుసగా తేలికపాటి భూప్రకంపనలు చోటుచేసుకోవడం జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ భూకంపం సంభవించేందుకు సంకేతాలనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రకంపనలు భారీ భూకంపానికి సంకేతాలుగా భావించలేమని, వీటి ఆధారంగా సన్నద్ధతకు సిద్ధం కావచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర ప్రకృతి వైపరీత్యాల మాదిరిగా భూకంప తీవ్రతను నిర్ధిష్టంగా ఊహించలేమని అన్నారు.

చదవండి : డాక్ట‌ర్ గుప్తా కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం

మరిన్ని వార్తలు