మృతదేహంతో 3 కి.మీ. నడక..!

1 Jan, 2020 19:26 IST|Sakshi

కొచ్చి : కేరళ పోలీసుల తీరుపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (కేఎస్‌హెచ్చార్సీ) మండిపడింది. ఇద్దరు ఆదివాసీల భుజాలపై దాదాపు మూడు కిలోమీటర్లు మృత దేహాన్ని తరలించిన ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ చీఫ్‌ సెక్రటరీ, ఎర్ణాకులం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. వివరాలు.. ఎర్ణాకులం జిల్లాలోని కుత్తంపుజా పరిధిలోని కుగ్రామం కాంజీపురలో సోమన్‌ (37) అనే వ్యక్తి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అయితే, మృతదేహాన్ని వాహనంలో కాకుండా ఇద్దరు ఆదివాసీలు భుజాన మోసుకెళ్లారు. కాలినడకన 3 కి.మీ ప్రయాణించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వార్తల్ని సుమోటోగా తీసుకున్న కేఎస్‌హెచ్చార్సీ పోలీసుల తీరును తప్పుబట్టింది. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలె​క్టర్‌, సీఎస్‌కు ఆదేశాలిచ్చింది. కాగా, సరైన రోడ్డు వసతి లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని జిల్లా ఎస్పీ కె.కార్తీక్‌ తెలిపారు. రోడ్డు సరిగా లేకపోవడంతో పోలీసులు అక్కడికి కాలి నడకన చేరుకుని మృతదేహాన్ని తెచ్చేందుకు ఆ గ్రామస్తుల సాయం తీసుకున్నారని చెప్పారు. కాంజీపురకు ఇప్పటివరకు విద్యుత్‌, రోడ్డు రవాణా సదుపాయాలు లేవని వెల్లడించారు.

మరిన్ని వార్తలు