టిక్‌టాక్‌ నిషేధం నోట్ల రద్దు‌ వంటిదే: నుస్రత్‌ జహాన్‌

1 Jul, 2020 16:51 IST|Sakshi

కోల్‌కతా: భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్‌ యాప్‌లపై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గూగుల్‌ ప్లే స్టోర్, యాప్‌ స్టోర్‌ల‌లో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్నియాప్‌లను కూడా తొలగించారు. భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి కొంత మంది మద్దతు పలకగా.. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్ మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. ఆమె బుధవారం కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. (టిక్‌టాక్‌ భారత ఉద్యోగులకు సీఈఓ లేఖ)

ఈ నిషేధం వెనక ఉన్న వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని నుస్రత్‌ జహాన్‌ సూటిగా ప్రశ్నించారు. మూకుమ్మడిగా చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌ను నిషేధించడం వల్ల దేశంలోని యువత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపో​యారని విమర్శించారు. ఇప్పడు టిక్‌టాక్‌ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారని నుస్రత్‌ జహాన్‌ దుయ్యబట్టారు. ఇక టిక్‌టాక్‌ సీఈఓ భారతదేశంలోని తమ ఉద్యోగులకు లేఖ రాస్తూ.. టిక్‌టాక్‌ సంస్థ ఉద్యోగులు గర్వించదగిన సానుకూల అనుభవాలు, అవకాశాలను పునరుద్ధరించడానికి తమ శక్తి మేరకు పని చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. (ఇక టిక్‌టాక్‌ యాప్‌ పనిచేయదు)

మరిన్ని వార్తలు