ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు: వ్యతిరేకించిన కాంగ్రెస్‌, ఎంఐఎం

21 Jun, 2019 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు శుక్రవారం పార్లమెంటు ముందు చర్చకు వచ్చింది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీన్ని మహిళల సాధికారిత, న్యాయానికి సంబంధించిన బిల్లుగా వర్ణించారు. అయితే బిల్లును తీసుకొచ్చిన మరుక్షణమే కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ దీన్ని వ్యతిరేకించారు. తలాక్‌ పద్ధతికి తాను వ్యతిరేకమేనని, అయితే దీన్ని నేరంగా పరిగణించడాన్ని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఇతర మతాల్లో కూడా పురుషులు భార్యలను వదిలి వేస్తున్నారని పేర్కొన్నారు. బిల్లులో ఎలాంటి విధానపరమైన భద్రతలు లేవని దాన్ని స్టాండింగ్‌ కమిటీకి నివేదించాలని థరూర్‌ డిమాండ్‌ చేశారు.

శశిథరూర్‌కు మద్దతిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా నినాదాలు చేశారు. ఎంఐఎం కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. ఈ బిల్లు రాజ్యంగ విరుద్ధమన్నారు. దీనిపై డివిజన్‌ ఓటింగ్‌ ​నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు