మా జోలికొస్తే గోళ్లు కత్తిరిస్తా: బిప్లబ్‌ దేవ్‌

1 May, 2018 17:48 IST|Sakshi

న్యూఢిల్లీ : తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బాగా అలవాటయ్యింది త్రిపుర ముఖ్యమంత్రి  బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌. ఈయన ప్రతి రోజు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు విప్లవ్‌ని‌, బీజేపీలను విపరీతంగా ట్రోల్‌ చేసేస్తున్నారు. మహాభారత కాలంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్‌ వరల్డ్‌ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్‌ సర్వీసెస్‌కు సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్‌ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్‌ షాపులు పెట్టుకోవటం, ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస వివాదస్పద వ్యాఖ్యలతో రోజు మీడియాలో నిలుస్తున్నారు.

తాజాగా  బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి ప్రమాదం తప్పదు అని హెచ్చరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వీడియోలో తన ప్రభుత్వం జోలికి వస్తే ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయో చెప్పడానికి ఆయన కూరగాయలు అమ్మే వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాడు. ‘కూరగాయలు అమ్మే వ్యక్తి సొరకాయలను అమ్ముదామని ఉదయ​ 8 గంటల ప్రాంతంలో మార్కెట్‌కు వచ్చాడు. కానీ 9 గంటలకల్లా ఆ సొరకాయ చెడిపోయింది. కారణం... వచ్చిన వినియోగదారలందరూ సొరకాయను పరీక్షించడానికి తమ గోర్లతో నొక్కి చూసారు. అందువల్ల ఆ సొరకాయ చెడిపోయింది.’ అలానే ఎవరైన నా ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకున్న, నా ప్రభుత్వాన్ని హేళన చేస్తే... నేను వారి గోళ్లను కత్తిరిస్తాను. కాబట్టి జాగ్రత్త నా ప్రభుత్వాన్ని తాకే ప్రయత్నం కూడా చేయకండి అంటూ హెచ్చరించారు.

బిప్లబ్‌ రోజు ఇలా ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అతని నోటికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. బిప్లబ్‌ను తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. మే 2నఆయనను తమ ఎదుట హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించినట్లు సీనియర్‌ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు