మహారాష్ట్ర నుంచి కేరళకు ఏడాది పట్టింది

20 Jul, 2020 15:13 IST|Sakshi

తిరువనంతపురం: ఓ ట్రక్కు మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఏకంగా ఏడాది పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. ఈ ట్రక్కు విక్రం సారాభాయి స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఆదివారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్‌ మాట్లాడుతూ.. ‘గత ఏడాది జూలై 8న మా ప్రయాణం ప్రారంభమయ్యింది. సంవత్సరం పాటు ప్రయాణించి.. నాలుగు రాష్ట్రాలు దాటి ఈ రోజు తిరువనంతపురం చేరాము. ఈ రోజే యంత్రాలను అక్కడికి చేరుస్తాం’ అన్నారు. ఈ ట్రక్కులో తేలికపాటి పదార్థాలను తయారు చేయడానికి వాడే ఏరోస్సేస్‌ హారిజాంటల్‌ ఆటోక్లేవ్‌ని తీసుకొచ్చారు. గత ఏడాది మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ ట్రక్కు రోజుకు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసేది. దీనితో పాటు 32 మంది వర్కర్లు ఉన్నారు. (‘అనంత’ సంపద ఎన్నడు తెలిసేను?)

ఈ మెషన్‌ బరువు సుమారు 70 టన్నులు ఉండగా.. ఎత్తు 7.5 మీటర్లు, వెడల్పు 2.65 మీటర్లుగా ఉంది. ఈ మెషన్‌ని నాసిక్‌లో తయారు చేశారు. అతి త్వరలోనే ఇది భారతీయ స్పేస్‌ రిసర్చ్‌ ప్రాజెక్ట్‌ల్లో పాలు పంచుకోనుంది. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘సరుకు బరువును మోయడానికి మేము తాళ్లను ఉపయోగించాము. ఈ ట్రక్కును లాగడానికి ముందు, వెనక రెండు ఇరుసులు ఉన్నాయి. రెండింటికి ఒక్కొక్కదానికి 32 చక్రాలు, పుల్లర్‌కు 10 చక్రాలు ఉన్నాయి. పుల్లర్ వీటన్నింటిని లాగుతుంది.. డ్రాప్ డెక్ 10 టన్నుల బరువు, సరుకు 78 టన్నుల బరువు ఉంటుంది. బరువు రెండు ఇరుసులపై పంపిణీ అవుతుంది’ అని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు