టీవీ బాంబు కలకలం

10 May, 2018 07:51 IST|Sakshi

మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు టీవీలో పెట్టిన బాంబును బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పేల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం సమీపంలో ఓ చెట్టు వద్ద మావోయిస్టులు టీవీలో బాంబు పెట్టి ఉంచారు. మల్కన్‌గిరి–జయపురం రోడ్డు పక్కన దీనిని పెట్టారు. ఈ ప్రాంతం బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. అయితే చెట్టు వద్ద టీవీ ఉండడం గమనించిన స్థానికులు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. టీవీలో బాంబు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌ తీసుకొచ్చి మరో బాంబుతో టీవీలో ఉన్న బాంబును పేల్చివేశారు. 

ఈ సంఘటన నేపథ్యంలో మల్కన్‌గిరి–జయపురం రహదారిలో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఘటనపై మల్కన్‌గిరి ఎస్పీ జోగ్‌మోహన్‌ మిన్నా మాట్లాడుతూ బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం టీవీ ఉండడంతో అందులో బాంబు ఉందేమోనని అనుమానం వచ్చిందన్నారు. దీంతో బాంబు స్క్వాడ్‌ తీసుకొచ్చి టీవీని పరిశీలించి అందులో బాంబును పేల్చివేశామన్నారు.

మరిన్ని వార్తలు