భర్తల గోడు చెప్పుకునేందుకు ‘పురుష్‌ ఆయోగ్‌’..!

2 Sep, 2018 14:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పురుష్‌ ఆయోగ్‌ ఏర్పాటుకై బీజేపీ ఎంపీల డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు, భార్యల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న పురుషులకు కూడా తమ గోడు చెప్పుకునేందుకు ఓ కమిషన్‌ ఉండాలని బీజేపీ ఎంపీలు హరినారాయణ్‌ రాజ్‌బిహార్, అన్షుల్‌ వర్మ అన్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ భర్తలకు చుక్కలు చూపెడతున్న భార్యల నుంచి రక్షణ పొందేందుకు ‘పురుష్‌ ఆయోగ్‌’ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. మగవారి బాధలు చెప్పుకునేందుకు సరైన వేదిక లేనందున ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పురుష్‌ ఆయోగ్‌ ఏర్పాటుకు మద్దతు కూడగట్టేందుకు సెప్టెంబర్‌ 23న సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో కూడా లేవనెత్తామని పేర్కొన్నారు.

డిమాండ్‌ ఓకే.. కానీ, అనవసరం..
ప్రతి ఒక్కరికి తమ డిమాండ్‌లను లేవనెత్తే హక్కు ఉంటుందని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్) శనివారం వెల్లడించిన నేపథ్యంలో.. పురుషులకు కూడా ఒక కమిషన్‌ ఉండాలని కోరుతున్నట్టు ఎంపీలు వివరించారు. అయితే, పురుషుల కోసం ఎలాంటి కమిషన్‌ ఏర్పాటు అవసరం లేదని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ చెప్పడం విశేషం.

సెక్షన్‌ 498ఎ సవరించాలి..
దాడులు, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు ఐపీసీలోని సెక్షన్‌ 498ఎ రక్షణ కల్పిస్తోంది. అయితే, కొందరు మహిళలు ఈ సెక్షన్‌ను ఆసరాగా చేసుకుని వారి భర్తలు, అత్తింటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ వర్మ అన్నారు. తప్పుడు కేసుల మూలంగా 1998 నుంచి 2015 వరకు 27 లక్షల మంది అరెస్టయ్యారని తెలిపారు. 498-ఎను సవరిస్తే తప్పుడు కేసులు నమోదు కావని అన్నారు. కాగా, తప్పుడు ఫిర్యాదులతో మగవారిపై కేసుల నమోదు సంఖ్య పెరిగిందని గతేడాది కేంద్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మేనకా గాంధీ పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు