ఇండిగో పైలట్లను సస్పెండ్ చేసిన డీజీసీఏ

6 Sep, 2019 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) హెచ్చరికను పట్టించుకోకుండా విమానాన్ని నడిపినందుకు ఇద్దరు ఇండిగో పైలట్లను డీజీసీఏ సస్పెండ్‌ చేసింది. వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న ఇండిగో విమానం టేల్‌ ప్రాప్‌(విమానం ల్యాండ్‌ అయిన  సమయంలో దానికి సపోర్టింగ్‌గా వెనుక భాగంలో ఉంచే స్టాండ్‌)తో అలానే టేకాఫ్‌ అయింది. విమానంలో గాల్లోకి లేచే సమయంలో టేల్‌ ప్రాప్‌ కిందకు వేలాడకూడదు.  అయితే దీనిని గమనించిన ఏటీసీ అధికారులు విమానంలోని ఇద్దరు పైలట్లకు ఈ సమాచారం చేరవేశారు. అయితే వారు విమానాన్ని తిరిగి హైదరబాద్‌కు మళ్లించకుండా విజయవాడకు వెళ్లారు.

జూలై 24న చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఆ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లను సస్పెండ్‌ చేసింది. ఈ విధంగా టేల్‌ ప్రాప్‌ తో ప్రమాణం ప్రమాదకరమని డీజీసీఏ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సదరు పైలట్లకు షో కాజ్‌ నోటీసులు జారీ చేయగా.. వారు తమ తప్పును అంగీకరించారు.

>
మరిన్ని వార్తలు