కుప్పకూలిన విమానం, విషాదం  

4 Jan, 2020 08:44 IST|Sakshi

కుప్పకూలిన శిక్షణా విమానం,  ఇద్దరు పైలెట్లు  దుర్మరణం 

మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. సాగర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనర్ విమానం కూలిపోయింది. ఈ  దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారనీ సీఎంఓ ట్వీట్‌ చేసింది.

`చిమ్స్ అకాడమీ 'విమానం (సెస్నా172) ధానా ఎయిర్‌స్ట్రిప్ వద్ద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, అదుపు తప్పి పక్కనే ఉన్న మైదానంలో కూలిపోయిందని సాగర్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రైనర్ అశోక్ మక్వానా (58), ట్రైనీ పియూష్ సింగ్ (28) మృతి చెందారని తెలిపారు. పొగమంచు కప్పేయడంతో రన్‌వే  సరిగా కనిపించక ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు.

అటు ఈ సంఘటనను చిమ్స్ అకాడమీ స్థానిక నిర్వాహకుడు రాహుల్ శర్మ ధృవీకరించారు. సెస్నా 172లో గ్లాస్ కాక్‌పిట్‌తో పాటు రాత్రిపూట ప్రయాణానికి  అవసరమైన అన్ని సౌకర్యాలున్నాయని అకాడమీ వర్గాలు తెలిపాయి. అకాడమీ వెబ్‌సైట్ ప్రకారం, ఇది కమర్షియల్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కోర్సులను నడుపుతుంది.

మరిన్ని వార్తలు