నగలు తీయించి పరుగో పరుగు

29 Mar, 2017 11:40 IST|Sakshi
ముంబయి: పోలీసులమని చెప్పి ఓ ఇద్దరు దొంగలు 55 ఏళ్ల మహిళను బురిడీ కొట్టించారు. ఆమె దగ్గర నుంచి దాదాపు రూ.50వేల అభరణాలు ఎత్తుకెళ్లారు. ముంబయిలోని విల్‌ పర్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వారికోసం లుకౌట్‌ నోటీసులు అంటించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ అంధేరిలోని దుర్గా చావల్‌ ప్రాంతంలో విజయ మరాఠీ(55) అనే మహిళ ఉంది.

ఆమె పరిస్వాడా ప్రాంతంలోని సహార్‌ రోడ్డులోగల న్యూ ఎయిర్‌పోర్ట్‌ ప్రవేశ ద్వారం వద్ద వాకింగ్‌ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెకు తారసపడ్డారు. తాము పోలీసులం అని, ఆ ప్రాంతంలో నిఘా నడుస్తుందని, విలువైన వస్తువులు తీసుకొని వాకింగ్‌ వెళ్లకూడదని, ప్రమాదం పొంచి ఉందని నమ్మబలికించి ఆమె నగలు మొత్తం తీసివ్వాలని ఓ రుమాలు కూడా ఇచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ నగలు తీసుకెళ్లాలని అన్నారు. వారి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలాగే చేసింది. దాంతో వాటిని తీసుకొని దొంగలు పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు అక్కడే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  
మరిన్ని వార్తలు