దారుణం : మతిభ్రమించిన మహిళపై రాళ్ల దాడి

20 Jun, 2020 16:06 IST|Sakshi

ఫరూఖాబాద్ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మతి భ్రమించిన ఓ మహిళపై ఇద్దరు యువకులు దాడి చేశారు. మానసిక రోగి, అందులోనూ ఓ మహిళ అని చూడకుండా జుట్టు పట్టి లాగుతూ కిరాతకంగా దాడి చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మతి భ్రమించిన ఓ మహిళ ఆకలితో ఫరూఖాబాద్‌లోని తిర్వా కాలనీకి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరు యువకులు మహిళపై రాళ్లదాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. మహిళ ఏడుస్తున్నా విడిచిపెట్టకుండా పిడి గుద్దులు గుద్దారు. చివరకు స్థానికులు వచ్చి విడిపించడంతో ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలతో పడిఉన్న మహిళలను ఆస్పత్రికి తరలించారు. నిందితులను కుత్రా మండేయ గ్రామానికి చెందిన బాబా యాదవ్‌, విపిన్‌ రాజ్‌పుత్‌గా గుర్తించారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు