డ్రైవర్‌ పిచ్చి చేష్టలు : మహిళకు వింత అనుభవం

5 Mar, 2020 11:51 IST|Sakshi
నిద్రిస్తున్న ఊబర్‌ డ్రైవర్‌, తేజస్విని (ఫైల్‌)

పుణె : ఓ ఊబర్‌ క్యాబ్‌ ప్రయాణికురాలికి వింత అనుభవం ఎదురైంది. క్యాబ్‌ డ్రైవర్‌ పిచ్చి చేష్టల కారణంగా తనే స్వయంగా కారు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 21న పుణెలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తేజస్విని దివ్య నాయక్‌ అనే మహిళ గత నెల 21న పుణె నుంచి ముంబై వెళ్లడానికి క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. డ్రైవర్‌ కారు నడుపుతూ ఫోన్‌ మాట్లాడుతుండటంతో ఆమె వద్దని వారించింది. ఫోన్‌ మాట్లాడటం ఆపేసిన అతను ఆ తర్వాత నుంచి నిద్రలోకి జారుకోవటం ప్రారంభించాడు. కారు డ్రైవర్‌ తన నిద్రమత్తు కారణంగా ఒకానొక సమయంలో వేరే కారును ఢీ కొట్టబోయాడు. దీంతో భయపడిపోయిన ఆమె అతడ్ని ఓ అర్థగంట నిద్రపోమని, తాను కారు నడుపుతానని చెప్పింది. తనకు వెన్నునొప్పి ఉన్న కారణంగా ఎక్కువ సేపు కారు నడపలేనని అంది. ఆమె కారు నడపటం మొదలుపెట్టగానే అతడు నిద్రపోవటం మానేసి ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించాడు. ఆమె కారు బాగా నడుపుతోందంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

కొద్దిసేపటి తర్వాత డ్రైవర్‌ నిద్రపోవటంతో తేజస్విని అతడి ఫొటోలు, వీడియోలు తీసింది. ముంబై చేరుకోవటానికి ఓ అర్థగంట ముందు అతడు నిద్రలేచి డ్రైవింగ్‌ చేయటానికి ఉపక్రమించాడు. అతడి వాలకంతో బాగా నొచ్చుకున్న ఆమె అతడి ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో ఉంచింది. అంతేకాకుండా ఊబర్‌ కంపెనీని ట్యాగ్‌ చేసి ‘‘ ఇది జరిగినపుడు నేను నిద్రలో లేకపోవటం, డ్రైవింగ్‌ తెలిసుండటం వల్ల బ్రతికి బయటపడ్డాను. నేను కోపంతో రగిలిపోతున్నా. ఎంత ధైర్యం ఉంటే డ్రైవర్లు సరైన రెస్ట్‌ లేకుండా కారు నడపటానికి వస్తారు? ఎంత ధైర్యం ఉంటే పక్కవారి ప్రాణాలను ప్రమాదంలో పెడతారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు