మన్‌ కీ బాత్‌పై ఉద్ధవ్‌ సెటైర్లు

23 Feb, 2020 14:51 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఏఆర్‌ అంతూలేపై పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం మన్‌ కీ బాత్‌పై వ్యంగ్యోక్తులు విసిరారు. అంతూలే శివసేన వ్యవస్ధాపకులు బాల్‌ ఠాక్రేకు అత్యంత సన్నిహితులని, ఈ పుస్తకం దిల్‌ కీ బాత్‌ వంటిదని, ఇది మన్‌ కీ బాత్‌కు భిన్నమైనదని ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ఉటంకిస్తూ చురకలు వేశారు. అంతూలే అద్భుత పరిపానా దక్షుడని, తన సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్పనేతని కొనియాడారు.

అంతూలే సాహెబ్‌ ప్రతిరోజూ తన భార్యకు ఈ లేఖలు రాయగా ఆమె వాటిని భద్రంగా దాచారని ఇది వారి మధ్య నెలకొన్న గొప్ప బంధానికి సంకేతమని ఠాక్రే అన్నారు. అంతూలే కేంద్ర మంత్రి అయిన సందర్భంలో తాను ఢిల్లీలో శివసేనకు బ్రాండ్‌ అంబాసిడర్‌నని చెప్పడం తనకు గుర్తుందని ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన బతికిఉంటే తన స్నేహితుడి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యేవారని అన్నారు. తన తండ్రి స్నేహితులందరూ తనను ఇష్టపడతారని శరద్‌ పవార్‌ వైపు చూస్తూ ఠాక్రే గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌లు పాల్గొన్నారు.

చదవండి : ‘అది మరో జలియన్‌ వాలాబాగ్‌’

మరిన్ని వార్తలు