శంకర్ భార్య కౌసల్య ఆత్మహత్యాయత్నం!

12 May, 2016 18:16 IST|Sakshi
శంకర్ భార్య కౌసల్య ఆత్మహత్యాయత్నం!

చెన్నై: పరువు హత్య వ్యవహారంలో హత్యకు గురైన దళితుడు శంకర్‌ భార్య ఎస్ కౌసల్య (20) తాజాగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమె గురువారం రసాయన పౌండర్‌ను తిని ప్రాణాలు తీసుకోవడానికి యత్నించింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన పరువు హత్య వ్యవహారంలో దళిత యువకుడైన శంకర్‌ను కౌసల్య కుటుంబసభ్యులు పట్టపగలే నరికిచంపిన సంగతి తెలిసిందే.

కౌసల్యను చికిత్స నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణగండం తప్పిందని సమాచారం. ఒకే కాలేజీ విద్యార్థులైన శంకర్, కౌసల్య ప్రేమలో పడి 2015లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిను ఇరువైపులా కుటుంబాలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకొని కౌసల్య శంకర్‌ ఇంటికి వచ్చేసింది. అగ్రకులానికి చెందిన ఆమె కుటుంబసభ్యులు పలుమార్లు ఈ దంపతులను హెచ్చరించారు. కొన్నిసార్లు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట తిరుపూర్‌ జిల్లా ఉడుమల్ పేట బస్టాంట్ వద్ద పట్టపగలే అతికిరాతకంగా శంకర్‌ను కౌసల్య కుటుంబసభ్యులు నరికి చంపారు. కౌసల్యపైనా వారు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలతో బయటపడిన ఆమె కోలుకొన్న తర్వాత కొమరలింగంలోని శంకర్‌ ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది.

'మూడేళ్ల కిందట నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత నా కొడుకును పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు నా కోడలు కూడా ఆత్మహత్యకు యత్నించడం నా కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభను మరింత పెంచుతోంది' అని కౌసల్య మామ వేలుస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు