బ్రిటన్‌ కోర్టులో నీరవ్‌ మోదీకి ఎదురుదెబ్బ

12 Jun, 2019 15:35 IST|Sakshi

లండన్‌ : పీఎన్‌బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీకి బ్రిటన్‌ హైకోర్టులో బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను బ్రిటన్‌ కోర్టు తోసిపుచ్చింది. మోదీకి బెయిల్‌ మంజూరు చేస్తే ఆయన సాక్ష్యాలకు అవరోధం కల్పించవచ్చనేందుకు ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. పీఎన్‌బీ స్కాంతో పాటు మనీల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోదీని తమకు అప్పగించాలని భారత్‌ కోరుతున్న సంగతి తెలిసిందే.

మోదీ అప్పగింతపై విచారణ సాగుతున్న క్రమంలో దిగువ కోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ నీరవ్‌ మోదీ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా మోదీ బెయిల్‌ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టు తిరస్కరించడం ఇది నాలుగవసారి కావడం గమనార్హం. నీరవ్‌ మోదీ, ఆయన మామ మెహుల్‌ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్‌బీ నుంచి రూ 11,400 కోట్ల మేర రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు