నిరుద్యోగం ‘అడ్రెస్‌’ గల్లంతు

15 Mar, 2019 22:22 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘నిరుద్యోగం’ ప్రధానాంశం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఓ మీడియా నిర్వహించిన సర్వేలో కూడా ఓటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎన్‌ఎన్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ నిఖిల్‌ కుమార్‌ కూడా పలు విశ్లేషణల్లో ఇదే విషయం చెప్పారు. ఆశ్చర్యంగా ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ సమస్య బాగా వెనకబడి పోయింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మోదీ అవినీతి, విద్వేష రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతుంటే ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా అదే ధోరణిలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం లాంటి ఒకరిద్దరు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే ఎక్కువగా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నారు.

గత 49 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌’ నుంచి లీకైనా నివేదిక వెల్లడించింది. దానిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ‘నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌’లో ఇద్దరు సభ్యులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. నాటికి దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి పదేళ్ల యూపీఏ పాలనే కారణమని కూడా ఆరోపించారు. దేశంలో 2014 సంవత్సరానికి నిరుద్యోగ సమస్య 2.1 శాతం ఉండగా, ఇప్పుడు అది 6.1 శాతానికి చేరుకుందని అంటే దాదాపు మూడింతలు పెరిగినట్లు.

2016, సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన ఫలితంగా కొత్త ఉద్యోగాలు రాకపోగా అనేక రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు 90 లక్షల ఉద్యోగాలు పోయాయని నాడు పలు సర్వేలు వెల్లడించాయి. 2017, డిసెంబర్‌ నుంచి 2018, డిసెంబర్‌ నాటికి దేశంలో 1.10 కోటి ఉద్యోగాలు పోయాయని మరో సర్వే తెలియజేసింది. ఇదివరకు దేశంలో ఉపాధి అవకాశాలపై నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్, కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యాన ప్రతి మూడు నెలకోసారి సర్వే జరిగేది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నిరుద్యోగ శాతం పెరుగుతోందని ఆ సర్వేల్లో తేలడం ఆ సర్వేలన్నింటినీ మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఐదేళ్లకోసారి సర్వే జరిపితే సరిపోతుందని తేల్చి చెప్పింది. అలా జరిపిన సర్వేనే లీకయింది. ఆది పూర్తి నివేదిక కాదని, ముసాయిదా మాత్రమేనంటూ కేంద్ర గణాంకాల శాఖ తప్పించుకుంది. అధికారికంగా నివేదిక లోక్‌సభ ఎన్నికల అనంతరమే వెలువడనుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై ఆ నివేదికలోని నిజానిజాలు ఆధారపడి ఉంటాయి.

మరిన్ని వార్తలు