పిల్లల్లో అమితాబ్‌కే క్రేజ్‌ ఎక్కువ

21 Nov, 2017 10:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మాస్టర్ బాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కంటే బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కే భారత్‌లో ఎక్కువ పాపులారిటీ ఉందని యూనిసెఫ్‌ నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. నవంబర్ 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సర్వే వివరాలతో కూడిన నివేదికను వెలువరించింది. 

9-18 ఏళ్లలోపు పిల్లలు తమ పుట్టిన రోజు వేడుకలకు ఏ సెలబ్రిటీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు అన్న ప్రశ్నకు.. ఎక్కువ మంది అమితాబ్‌ పేరును బదులిచ్చారు. భారత్‌లో బాలీవుడ్‌ స్టార్లు, ప్రధాని మోదీ, సచిన్‌ వంటి క్రికెట్‌ స్టార్ల పేర్లను వారి వద్ద ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే వీరిలో ఎక్కువ మంది బిగ్‌ బీనే తమ అతిథి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైంది ఏంటంటే.. ముక్తకంఠంతో టెర్రరిజం అన్న సమాధానం వినిపించారు.

ప్రస్తుతం భారత్‌లోని చిన్నారుల్లో పరిపక్వత అన్నది పెరిగిపోయింది. కానీ, ఆడపిల్లలపై మాత్రం వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. వారి చదువుల కోసం మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అని యూనిసెప్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ జస్టిన్‌ ఫోర్సిత్‌ అభిప్రాయపడ్డారు. ఈ సర్వేల్లో మిగతా దేశాల్లో బరాక్‌ ఒబామా, ఫుట్‌ బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, జస్టిన్‌ బీబర్‌, టేలర్‌ స్విఫ్ట్ వంటి సెలబ్రిటీల పేర్లను అత్యధికంగా పిల్లలు వెల్లడించారు. సుమారు 14 దేశాల్లో(భారత్‌లో 1000 మంది) అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న యూనిసెఫ్‌ ఈ విషయాలను వెల్లడించింది. 

మరిన్ని వార్తలు