బడ్జెట్‌ 2020 : ‘ఇదొక తెలివి తక్కువ బడ్జెట్‌’

2 Feb, 2020 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ : మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే చర్యల్ని కేంద్రం ఏ కోశానా తీసుకోలేదని కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ అన్నారు. ప్రభుత్వ వ్యయాల్ని పెంచకుండా.. వృద్ధిరేటు 10 శాంత ఆశిస్తామనడం అవివేకమే అవుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాటలు కోటలు దాటేలా ఉన్నా.. బడ్జెట్‌ మాత్రం పేవలంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో పెరుగుదల లేదని తెలిపారు. గ్రామీణ ఉపాధి కల్పన పథకానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.10 వేల కోట్లు తక్కువగా కేటాయించారని చెప్పారు. 
(చదవండి : పన్ను పోటు తగ్గినట్టేనా?)

ప్రభుత్వ వ్యయాల్ని కేవలం 9 శాతమే పెంచారని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా మాంద్య పరిస్థితులు ఒకవైపు, కరోనా వైరస్‌ మరోవైపు తరుముకొస్తున్నాయని హెచ్చరించారు. మరో వారం రోజుల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయకపోతే.. ప్రపంచ మార్కెట్లు దారుణంగా పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళపై కేంద్ర ప్రభుత్వం కత్తిగట్టిందని వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన తమపై కేంద్ర బడ్జెట్‌ 2020 కనికరించలేదని అన్నారు. గతంతో కేంద్ర పన్నుల్లో 3.5 శాతంగా ఉన్న కేరళ వాటాను.. పెంచాల్సింది పోయి 1.9 శాతం కోత విధించారని మండిపడ్డారు.
(చదవండి : కేంద్ర పన్నుల కేటాయింపుల్లో కోత!)

జీఎస్టీ కింద కేంద్రం నుంచి రూ.3500 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. జనాభా నిష్పత్రి ప్రకారం రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఉండాలనే 15వ ఆర్థిక సంఘం సూచనలు కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోతున్నాయని చెప్పారు. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా.. కేరళ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ‘మాకు వరద సాయం అందించలేదు. పన్నుల్లో కోత విధించారు. బకాయిలు చెల్లిుచలేదు. కేరళ పనర్నిర్మాణానికి రుణ సదుపాయాలు కల్పించలేదు. అయినప్పటికీ.. రాజకీయాలు, రాష్ట్ర అభివృద్దికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాం. మాకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది’అన్నారు.

>
మరిన్ని వార్తలు