‘పీఎం జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు’

1 Feb, 2020 12:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ 2020-21లో ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ భారతానికి రక్షిత మంచి నీరు అందించే పథకం ‘జల్‌ జీవన్‌ మిషన్‌’కు పత్యేక ప్రాధాన్యత కల్పించిన కేంద్రం రూ.3.6 లక్షల కోట్లు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ రంగాలు, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. 
(చదవండి : బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

20 వేల ఆస్పత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రైతుల కోసం కిసాన్‌ రైల్వే-కిసాన్‌ ఉడాన్‌ పథకాలను తీసుకొస్తున్నామని చెప్పారు. పళ్లు, పూలు, కూరగాయల ఎగుమతులకు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ జనరిక్‌ మందులు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టీబీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దానికోసం విసృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. 

మరిన్ని వార్తలు