కొత్త విధానంలో పన్ను తగ్గుదల ఉత్తుత్తిదేనా..?

2 Feb, 2020 03:08 IST|Sakshi

భారీగా పెరగనున్న పన్ను భారం

దీర్ఘకాలిక పొదుపు అలవాటుపై ప్రతికూల ప్రభావం

ఆర్థిక మంత్రి చర్యలను తప్పుపడుతున్న ట్యాక్స్‌ నిపుణులు

సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గు తుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించు కోవడానికి చాలామంది బీమా, పీపీఎఫ్, గృహ రుణాలు వంటివి తీసుకుంటున్నారని, ఇప్పుడు వీటిని తొలగించడం వల్ల ఈ పథకాలకు ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ట్యాక్స్‌ నిపుణులు ఎంఎన్‌ శాస్త్రి స్పష్టం చేస్తున్నారు.

వృద్ధిరేటును పెంచడం కోసం పొదుపు శక్తిని తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచాలని ఆర్థికమంత్రి ఆలోచన కింద ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ ఇది దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఏ విధంగా చూసినా కొత్త విధానం కంటే పాత విధానమే భారం తక్కువగా ఉంటుందని ట్యాక్స్‌ నిపుణురాలు కె.వి.ఎల్‌.ఎన్‌ లావణ్య స్పష్టం చేస్తున్నారు.పన్ను రేటు సగానికి సగం తగ్గినా మినహాయింపులు ఎత్తివేయడం వల్ల పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత విధానంలో రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారి వరకు మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని, అదే కొత్త విధానంలో అయితే ఏకంగా రూ.37,500 పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు.

మరిన్ని వార్తలు