పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే..

2 Aug, 2017 12:23 IST|Sakshi
పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే..
లక్నో: కుల,మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారెజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ కెబినేట్‌ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా పెళ్లి రిజిస్ట్రేషన్‌లు ఖచ్చితంగా చేయాలని 2006లోనే సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా యూపీతో పాటు రెండు రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలవుతోంది. 11 ఏళ్ల తర్వాత యూపీ ప్రభుత్వం మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌-2017 పేరిట నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లి అయిన వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఏడాదిలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే రోజుకు రూ.10, ఆపై ఆలస్యం చేస్తే రూ.50ల చొప్పున పెరుగుతూ పోతుందని తెలిపింది.
 
అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వైద్య శాఖ మంత్రి సిద్దార్థ్‌ నాథ్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. కొంత మంది ముస్లింలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుల ఫోటోలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిందని, ముస్లింల నిఖామలో ఫోటోలు లేకపోవచ్చు కానీ, ఆధార్‌ కార్టులాంటి వాటికి ఫోటోలున్నాయి కదా.. మ్యారెజ్‌ సర్టిఫికెట్‌ కూడా అలాంటిదేనని మంత్రి సిద్దార్థ్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌ పోర్టల్‌ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
మరిన్ని వార్తలు