ఇకపై కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం

17 Oct, 2019 15:27 IST|Sakshi

లక్నో : ఇటీవలి కాలంలో చాలా మంది విద్యార్థులు మొబైల్‌ ఫోన్లకు బానిసలుగా మారుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మొబైల్‌ ఫోన్ల వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కాలేజ్‌లు, యూనివర్సిటీల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గురువారం సర్క్యులర్‌ జారీచేసింది. క్లాస్‌లు జరుతున్న సమయంలో చాలా మంది విద్యార్థులు మొబైల్‌ ఫోన్లపై దృష్టి పెట్టి.. అధ్యాపకులు చెప్పే విషయాలను పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు ఇకపై యూనివర్సిటీ, కాలేజ్‌ల్లో పరిసరాల్లో మొబైల్స్‌ వాడేందుకు అవకాశం ఉండదు.  

మరీ ముఖ్యంగా ఈ నిబంధన బోధన సిబ్బందికి కూడా వర్తించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు, అధ్యాపకులు తమ విలువైన సమయాన్ని ఎక్కువగా మొబైల్‌ ఫోన్ల వాడకానికి కేటాయిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. గతంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ముఖ్యమైన సమావేశాలకు అధికారులు, మంత్రులు మొబైల్‌ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు