‘ఇక అందమైన కశ్మీరీ యువతుల్ని పెళ్లిచేసుకోవచ్చు’

7 Aug, 2019 15:23 IST|Sakshi

కశ్మీర్‌పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో : ఆర్టికల్‌ 370, 35ఏ రద్దుతో దేశమంతా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఉన్న అడ్డండకులన్నీ తొలగిపోయానని, ఇప్పుడు అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని వివాహం చేసుకోవచ్చని వ్యాఖ్యానించి కతౌలి ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ దుమారం రేపాడు. ఆర్టికల్‌ 370 రద్దు కావడంతో ముజరాఫరాబాద్‌లో బీజేపీ జిల్లా శాఖ మంగళవారం అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సైనీ.. ‘ఆర్టికల్‌ 370 రద్దుతో జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు చాలా సంతోషిస్తున్నారు. అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు.

ముస్లిం యువకులే కాదు.. హిందువులందరూ, దేశ వాసులందరూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కోసం పనిచేసే బ్యాచిలర్లు ఇప్పుడు దర్జాగా కశ్మీర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ప్లాట్లు, భూమి కొనుగోలు చేయొచ్చు. అందమైన యువతుల్ని వివాహం చేసుకోవచ్చు. నిబంధనల ఫలితంగా ఇంతకు ముందు అక్కడి యువతులపై అఘాయిత్యాలు జరిగేవి. ఇప్పుడు అలాంటివి ఉండవు’ అన్నారు. ఎమ్మెల్యే  వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కశ్మీర్‌ అంశంపై నరేంద్ర మోదీ సర్కార్‌ ఆచితూచి అడుగులేస్తున్న తరుణంలో సైనీ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు