ఉత్తరాఖండ్‌ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!

27 Jul, 2019 07:47 IST|Sakshi

ఆవులు ఆక్సిజన్‌ ఇస్తాయి: ఉత్తరాఖండ్‌ సీఎం 

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత త్రివేంద్ర సింగ్‌ రావత్‌ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. శ్వాసక్రియలో భాగంగా ఆవులు ఆక్సిజన్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌నే వదులుతాయని ఆయన సెలవిచ్చారు. ఆవులను నిమరడం ద్వారా అనేక శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చని తెలిపారు. అలాగే గోవులకు సమీపంలో నివసిస్తే ట్యూబర్‌ క్యూలోసిస్‌(టీబీ) కూడా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. ఆవు పాలు, మూత్రం సుగుణాలను ఆయన సభికులకు వివరించారు.

డెహ్రాడూన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రావత్‌ ఈ వ్యాఖ్యలు చేయగా, అందుకు సంబంధించిన వీడియో శుక్రవారం వెలుగులోకిరావడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. దీంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయం(సీఎంవో)లోని ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ఉత్తరాఖండ్‌లో సాధారణంగా ప్రజలు నమ్మేదాన్నే సీఎం చెప్పారని తెలిపారు. మరోవైపు అన్ని జీవుల్లాగే ఆవులు కూడా ఆక్సిజన్‌ తీసుకుని కార్బన్‌ డయాక్సైడ్‌ విడిచిపెడతాయనీ, రావత్‌ వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు