గాంధీనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా వడోదర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాగునీళ్లు ఇప్పించండి మహాప్రభో అంటూ అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వడోదరలోని హనుమాన్ నగర్ వాసులు చాలాకాలం నుంచి తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకున్నారు. స్థానికుడు మంజ్మాహుడా ఆ ఉన్నతాధికారి కాళ్లపై పడి దీనంగా ప్రాధేయపడటం వాళ్ల తాగునీటి సమస్య తీవ్రతను బహిర్గతం చేస్తోంది. మీ సమస్య తీరుస్తానని ఎంత నచ్చ చెప్పినా హుడా మాత్రం కచ్చితంగా తాగునీళ్లు అందించాలని వేడుకోవడం వీడియోలో చూడవచ్చు. దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యలు పెరిగిపోతున్నాయి.