ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

5 Jul, 2017 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల పర్వం మొదలైంది. ఆగస్టు 5న ఎన్నిక జరగనుంది. జూలై 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 19న వాటిని పరిశీలించి పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 21. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్‌ వేసే అభ్యర్థులను 20 మంది ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపరచాలి.

ఈ 40 మందీ పార్లమెంటు సభ్యులే అయ్యుండాలి. ఎన్నిక సమయంలో ఓటు వేసేందుకు ఎంపీలకు ప్రత్యేక పెన్‌లను ఇస్తారు. అది కాకుండా వేరే పెన్‌లతో ఓటు వేస్తే తిరస్కరణకు గురవుతుంది. అయితే ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైనా ఇప్పటివరకు అటు ఎన్డీయే కానీ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కానీ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. ఆయన రెండు పర్యాయాలు వరుసగా ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మరిన్ని వార్తలు