సీఎం నితీశ్‌పై ఇటుకలు, పెద్ద రాళ్లతో దాడి

14 Jan, 2018 10:14 IST|Sakshi

సాక్షి, పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కొందరు గ్రామస్తులు చుక్కలు చూపించారు. అది కూడా అడ్డుకోవడంతోనో.. ఆందోళనతోనో కాదు.. ఏకంగా పెద్ద పెద్ద ఇటుకపెడ్డలు, రాళ్లు, కర్రలతో. సెక్యూరిటీ సిబ్బందితోపాటు ప్రత్యేక భద్రతా దళం కూడా ఈ దాడిలో గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల నందన్‌ అనే గ్రామం మీదుగా పర్యటనకు వెళుతుండగా అనూహ్యంగా అప్పటి వరకు శాంతియుతంగా కనిపించిన గ్రామస్తులు రాళ్ల వర్షం కురిపించారు.

అతి సమీపం నుంచి ఇటుకపెడ్డలు, రాళ్లు విసిరికొట్టారు. సెక్యూరిటీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు తీవ్రంగా గాయపడుతూనే ముఖ్యమంత్రిని ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా తరలించాల్సి వచ్చింది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం నిజానికి ఆ దాడి భయానకంగానే జరిగిందని చెప్పాలి. భద్రతా లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, దీనిపై ముఖ్యమంత్రి నితీశ్‌ స్పందిస్తూ సామాజిక వ్యతిరేక శక్తులు చేసిన చర్య అని అన్నారు. ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన మద్దతు దారులు నితీశ్‌పై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.  

>
మరిన్ని వార్తలు