ఆ కారుతో హాహాకారాలు..

12 Jan, 2020 17:07 IST|Sakshi

యమునానగర్‌ : హరియాణాలోని యమునానగర్‌లో వేగంగా దూసుకెళ్లిన కారు ఓ సైక్లిస్ట్‌ను బైక్‌ను ఢీకొనడంతో పాటు ఆగిఉన్న కారును ధ్వంసం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యమునానగర్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌, అందులో ప్రయాణిస్తున్నవారు ఘటనా ప్రాంతం నుంచి పరారయ్యారు. వేగంగా దూసుకొచ్చిన హోండా సిటీ కారు తొలుత ఓ సైకిల్‌ను ఆపై బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కన నిలిపిఉంచిన కారునూ ఢీకొందని ప్రత్యక్ష సాక్షి బన్సీలాల్‌ వెల్లడించారు. అతివేగంతో ప్రమాదానికి కారణమైన కారులో ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి పాల్పడిన కారును సీజ్‌ చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అతివేగంతో ప్రయాణించిన కారు కొందరిని ఢీ కొన్న సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న తర్వాత కారు డ్రైవర్‌ పరారైనట్టు గుర్తించామని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మెహల్‌ లాల్‌ తెలిపారు. కారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. కారులో హుక్కా లభించడంతో డ్రైవర్‌ డ్రగ్స్‌ మత్తులో వాహనం నడిపినట్టు తెలుస్తోందని అన్నారు.

మరిన్ని వార్తలు