‘ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్ల దరఖాస్తు రుసుము తగ్గించాలి’

5 Aug, 2019 19:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  జాతీయ స్థాయి పోటీ పరీక్షల విషయంలో ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్ల దరఖాస్తు రుసుమును తగ్గించాలని, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ఉంచాలని ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఓబీసీలను క్రిమిలేయర్‌, నాన్‌ క్రిమిలేయర్‌లుగా  విభజించారని తెలిపారు. రిజర్వేషన్లతో పాటు ఇతర ప్రయోజనాలు రెండు వర్గాలకు సమానంగా అందుతున్నాయని అన్నారు. కానీ, వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల దరఖాస్తు రుసుము విషయంలో నాన్‌ క్రిమిలేయర్లు ఓసీలతో సమానంగా చెల్లించాల్సి వస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు నాన్‌ క్రిమిలేయర్‌ ఓబీసీలను ఆర్థికంగా వెనుకబడిన తరగతిగా గుర్తిస్తున్నాయని, జాతీయ స్థాయి పరీక్షల దరఖాస్తు రుసుము విషయంలో అది చెల్లుబాటు కావటం లేదన్నారు. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేవలం రూ. 200 మాత్రమే దరఖాస్తుకు చెల్లించగలరన్నారు. ఈ మేరకు జాతీయ స్థాయి పరీక్షల దరఖాస్తు రుసుము విషయంలో ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్లను ఎస్టీ, ఎస్టీలతో సమానంగా ఉండేలా చూడాలని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు