గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే

25 Apr, 2016 00:58 IST|Sakshi
గ్రామాభివృద్ధి మీ చేతుల్లోనే

పంచాయతీలకు నిధుల కొరత లేదు
♦ ‘పంచాయత్ దినోత్సవం’లో గ్రామపంచాయతీలను కోరిన ప్రధాని
 
 జంషెడ్‌పూర్: క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటంలో గ్రామపంచాయతీల పాత్ర కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ‘పంచాయత్ దినోత్సవం’ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో పంచాయతీలదే కీలకపాత్ర అని తెలిపారు. ఢిల్లీయే దేశం కాదని  దేశాభివృద్ధి గ్రామాభివృద్ధితోనే ముడిపడి ఉందన్నమోదీ నగరాలు, గ్రామాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు అధునాతన వసతులను అన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందుకోసం రైతులు, మహిళలు, చిన్నారులపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చే మార్పు ద్వారా భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకున్నంత ప్రాముఖ్యత గ్రామసభలకు ఉందని.. అందువల్ల గ్రామపంచాయతీలను మరింత పరిపుష్టం చేయాల్సిన బాధ్యత పంచాయతీ ప్రతినిధులకుందన్నారు. ప్రజల కలల సాకారానికి కేంద్ర ప్రభుత్వం, గ్రామపంచాయతీలు భుజం కలుపుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

మొన్నటివరకు పంచాయతీలకు నిధుల కొరత ఉండేదని.. ఇప్పుడు ఆ సమస్య లేనందున పంచాయతీ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు సరిగా జరుగుతుందా, లేదా? అనే విషయాన్నీ సమీక్షించాలన్నారు. ప్రతిఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా గ్రామస్తులంతా ప్రతినబూనాలన్నారు. గ్రామాల్లో వెలుగు తీసుకొచ్చేందుకు వెయ్యి రోజుల్లో 18వేల పల్లెలను విద్యుదీకరించాలని సంకల్పించామన్నారు. ‘గ్రామస్తులారా అప్రమత్తంగా ఉండండి. మీకోసం జరుగుతున్న పనులకు సంబంధించి నాకు తప్పుడు సమాచారం రావొద్దు. మీరు అప్రమత్తంగా ఉంటే.. నా ఆందోళన కాస్తై తగ్గుతుంది’  అని అన్నారు. వచ్చే మూడేళ్లలో ఐదుకోట్ల మంది గ్రామీణులకు ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని,  ఇవి లబ్ధిదారులకు అందేలా పంచాయతీ పెద్దలు చొరవతీసుకోవాలన్నారు.
 
 ప్రతి బొట్టూ ఒడిసిపట్టాలి
 దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని మోదీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ ప్రసంగంలో జలవనరుల సంరక్షణపైనే ప్రధాని దృష్టిపెట్టారు. ఈ ఏడాది 110 శాతం వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో నీటిసంరక్షణను ప్రజలూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.  ప్రభుత్వ యత్నాలతోపాటు ప్రజల భాగస్వామ్యంతోనే కరువు సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చన్నారు. జలసంరక్షణ ఉద్యమాన్ని ప్రజలే నడిపించాలన్నారు. 200 ఏళ్ల క్రితమే గాంధీ పుట్టిన పోరుబందర్‌లో భూగర్భ నీటి ట్యాంకులు నిర్మించారన్నారు. నీటి కొరత  స్ప్రింక్లర్లు, బిందుసేద్యం వంటివాటిపై దృష్టిపెట్టాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు