ఇండియాలోనే ఇలాంటివి సాధ్యం!

21 Jul, 2020 15:15 IST|Sakshi

డెహ్రాడూన్: మీరెప్పుడైనా మెట్ల‌పై నుంచి ట్రాక్ట‌ర్ న‌డ‌ప‌డం చూశారా? ఇలాంటివి సినిమాల్లోనే క‌దా.. అది కూడా గ్రాఫిక్స్‌తో చేస్తారు కానీ నిజ‌జీవితంలో అది అసాధ్యం క‌దా అని అనుకుంటున్నారా? కానీ కేదార్‌నాథ్ ఆల‌యం మెట్ల‌పై ఇది సాధ్యం చేశారు కొంద‌రు యువ‌కులు. ఆల‌య నిర్మాణ ప‌నుల కోసం ఉప‌యోగించే భారీ యంత్రాల‌ను ట్రాక్ట‌ర్‌పై ఉంచి తీసుకెళ్లారు. వారికి స‌హాయంగా మ‌రికొంత‌మంది ట్రాక్ట‌ర్‌ను మెట్ల‌పై బ్యాలెన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ఆదివారం ట్విటర్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం అంటూ ఓ క్యాప్ష‌న్‌ను కూడా జ‌త చేశారు నందా. ఇప్ప‌టికే ఈ వీడియోను 72,000 మంది చూశారు. అయితే ఈ వీడియోకి సంబంధించి చాలామంది పొడ‌గ్త‌ల వ‌ర్షం కురిపించ‌గా, ఆల‌య మెట్ల‌పై అంత భారీ యంత్రాల‌ను ఇలా తీసుకెళ్తే మెట్లు పాడ‌వుతాయంటూ కొంత మంది అభ్యంతరం తెలిపారు. ఒక‌వేళ ప్ర‌మాద‌వ‌శాత్తూ ఏదైనా జ‌రిగి ట్రాక్ట‌ర్ దొర్లితే వారి ప్రాణాల‌కే ముప్పు అంటూ మ‌రికొంద‌రు ట్వీట్  చేశారు. (‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’ )

ఈ ట్రాక్ట‌ర్ త‌యారీసంస్థ లింక్డ్ ఇన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ స్పందిస్తూ.. మా చిన్న ట్రాక్ట‌ర్ అసాధ్యమనుకున్న ప‌నిని సుసాధ్యం చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. స్థానిక స‌మ‌స్య‌ల‌కు సృజ‌నాత్మ‌క ప‌రిష్కారం చూపారు ఆ యువ‌కులు అంటూ ప్ర‌శంసించారు. 2013లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల దాటికి కేదార్‌నాథ్ ఆల‌యం స్వల్పంగా దెబ్బ‌తింది. 2017లో ఆల‌య పున‌ర్నిర్మాణానికి ప్ర‌ధానికి మోదీ శంకుస్థాప‌న చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో ఆల‌య పునర్నిర్మాణం, అభివృద్ధి త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌ధాని మోదీ స‌మీక్షించారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను మ‌రింత అభివృద్ధి చేయాల‌ని వాతావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల‌ని ఈ సంద‌ర్భంగా మోదీ సూచించారు. 
(ఛత్తీస్‌గఢ్‌ సీఎంపై మండిపడ్డ ఒమర్‌ అబ్దుల్లా )

మరిన్ని వార్తలు