మగవాళ్లే ఇంట్లో ఉండాలి.. అప్పుడే

5 Dec, 2019 15:47 IST|Sakshi

‘రాత్రి ఏడు దాటిన తర్వాత మహిళలు ఇంట్లోనే ఎందుకు ఉండాలి? అదే మగవాళ్లు ఇంట్లో ఉండవచ్చు కదా! ఈ అంశాన్ని మనం వ్యవస్థీకృతం చేద్దాం. ఇక నుంచి రోజూ ఏడు గంటలకే మగవాళ్లు ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకోండి. అప్పుడే మహిళలు సురక్షితంగా ఉండగలుగుతారు. పోలీసో, నా అన్నో..తమ్ముడో లేదా ఎవరో ఒక మగాడు నాకు రక్షణగా ఉండాలి అంటారు. అసలు సమస్యే మీరు కదా. మీరే ఇంట్లో ఉండండి. అప్పుడు ప్రపంచం హాయిగా ఉంటుంది’  అంటూ ఓ మహిళ ఆగ్రహంతో ఊగిపోయారు. దిశ వంటి అత్యాచార ఘటనలపై నిరసన వ్యక్తం చేస్తూ... ‘ఆమె అత్యాచారానికి గురికాలేదు. అతడే ఆమెపై అత్యాచారం చేశాడు’ అనే ప్లకార్డునున ఆమె ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నటాషా అనే నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా పెద్ద చర్చకు దారితీసింది.

ఈ విషయంపై స్పందించిన కొంతమంది పురుషులు.. మగవాళ్లంతా చెడ్డవాళ్లు కాదని... చదువుకోని వాళ్లు, పశు ప్రవృత్తి కలవారే అలాంటి ఘాతుకాలకు పాల్పడాతారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. సదరు మహిళకు మద్దతు పలుకుతూ... ఆడవాళ్లను ఇంట్లో ఉండమని చెప్పే మగవాళ్లు.. ఈ సలహా పాటిస్తే బాగుంటుంది కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక అత్యాచార ఘటనలు జరిగిన ప్రతిసారీ ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇలాంటి అకృత్యాలు జరిగితే.. ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్లారంటూ మహిళలు, అమ్మాయిలపై కొంతమంది ప్రబుద్ధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నాటి నిర్భయ ఘటన నుంచి నేటి దిశ ఉదంతం దాకా బాధితురాలినే బాధ్యురాలిగా చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా అక్కసు వెళ్లగక్కడం పితృస్వామ్యవ్యవస్థకు పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన అసహనాన్ని ఇలా వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు