అంధులకు సవాల్‌గా మారిన భౌతిక దూరం

14 Apr, 2020 10:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం పాటించాలన్న సార్వజనీన సూత్రం అంధులకు మాత్రం పెనుసవాల్‌గా మారింది. గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం అంధులు శబ్దాల్ని గ్రహిస్తూ, ధ్వని ఆధారంగా ముందుకు సాగుతారు. అడుగు బయటపెట్టాలంటే ఎవరో ఒకరి చేదోడు అవసరమైన వీరు భౌతిక దూరం పాటించాలన్న నియమాన్ని అనుసరించలేని దయనీయస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఇళ్ళల్లో ఉన్నాం కనుక భౌతిక దూరాన్ని పాటించగలిగామనీ, అయితే రేపు పాఠశాలలు ప్రారంభమైతే ఈ భౌతిక దూరాన్ని ఎలా పాటించాలో అర్థం కావడం లేదని కోల్‌కతాలోని ప్రముఖ అంధుల పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

‘నేను మా అమ్మతో గానీ, మా సోదరితోగానీ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం బయటకు వెళతాను. ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది’ అని అదే స్కూల్‌లో చదివే 11వ తరగతి విద్యార్థి సుబీర్‌ దాస్‌ అన్నారు. లాక్‌డౌన్‌తో స్కూల్‌ మూతపడటంతో విద్యార్థులకు మ్యాథ్స్‌ నేర్చుకునే అవకాశం లేకుండా పోయిందని టీచర్‌ ఒకరు చెప్పారు. మిగతా సబ్జెక్టులు ఆడియో ద్వారా పాఠాలు విని నేర్చుకునే అవకాశం ఉందని, కానీ మ్యాథ్స్‌ మాత్రం బ్రెయిలీ పుస్తకాల ద్వారా మాత్రమే అభ్యసించగలుగుతారని చెప్పారు. కాగా, విద్యార్థుల కావాల్సిన సదుపాయాలను వెంటనే సమకూర్చేందుకు గార్డియన్లకు మొబైల్‌ ఫోన్లు ఇచ్చారని వెల్లడించారు. (చదవండి: గడప దాటని ఇద్దరికి కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు